• +91 92463 77055
  • info@kabconsultants.com
  • 92463 77055

News

ఆగస్టు 29, 30న గ్రూప్‌-2

హైదారాబాద్‌, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గ్రూప్‌2 పరీక్ష నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 29, 30న పరీక్ష జరుగుతుందని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ తెలిపారు. 29న పేపర్‌1 (జనరల్‌ ఎబిలిటీస్‌, స్టడీస్‌), పేపర్‌2 (చరిత్ర, రాజకీయం, సమాజం), 30న పేపర్‌3 (ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి), పేపర్‌4 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం) పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఒక్కో పరీక్షకు మూడు గంటల సమయం ఉంటుందని తెలిపారు. ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం 600 మార్కులకు గ్రూప్‌2 పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.

పరీక్షకు వారం రోజుల ముందు నుంచే విద్యార్థులు తమ హాల్‌టికెట్లను https://tspsc.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. కాగా, ఇప్పటికే గ్రూప్‌-1 మెయిన్స్‌, గ్రూప్‌-4 పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. జూన్‌ 5 నుంచి 12 వరకు గ్రూప్‌-1 మెయిన్‌, జూలై 1న గ్రూప్‌-4 పరీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్‌-3 పరీక్ష తేదీని కూడా త్వరలో ప్రకటించనున్నారు. 783 గ్రూప్‌-3 ఉద్యోగాలకు నిరుడు డిసెంబర్‌ 29న నోటిఫికేషన్‌ విడుదలైంది. అందులో 126 ఎంపీడీవో, 95 నాయబ్‌ తహసీల్దార్‌ పోస్టులున్నాయి. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు 5,51,943 దరఖాస్తులు నమోదయ్యాయి. అంటే, ఒక్కో పోస్టుకు సగటున 507 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.